భారతీయ మొట్టమొదటి మహిళా పైలట్ గురించి తెలుసుకుందాం
ఎనభై సంవత్సరాల క్రితం.. ఆడవాళ్లు ఇంట్లో నుండి బయటకు వెళ్లేందుకే ఎంతగానో ఆలోచించే ఆ రోజుల్లో చీర ధరించిన ఒక భారతీయ మహిళ విమానం నడిపారంటే నమ్మగలమా?
సరళా థాక్రల్.. భారతదేశానికి మొదటి మహిళా పైలట్! 16 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్న సరళా తన కల సాధించడానికి తన కుటుంబం నుండి అసాధారణమైన మద్దతును పొందింది.
ఆమె భర్త కరాచీ-లాహోర్ల మధ్య విమానవాహక పైలట్ లైసెన్స్ పొందిన తొలి భారతీయుడు. దీంతో సరళ కూడా పైలట్ కావాలని కలలు కన్నారు. ఆవిడ మామగారు ఎంతో ఉత్సాహం ఆవిడని కూడా ఫ్లైయింగ్ క్లబ్బులో చేర్చారు. ఆరోజుల్లో పురుషులకు మాత్రమే పరిమితమైన రంగంలో అడుగుపెట్టడం అంటే సాహసమే. కానీ సరళా థాక్రల్ ఎన్నడూ ఆత్మనూన్యతకు లోనుకాలేదు.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.
ఆమె భర్త, మామగారి నుండి అన్ని అంశాల్లోనూ విశేషమైన మద్దతు లభించింది. కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అని అందరూ భావించే ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించారు సరళ. 1936 సంవత్సరంలో జిప్సీ మోత్ మోడల్ విమాన కాక్-పిట్లో కాలుమోపారు.. భారతదేశపు మొట్టమొదటి మహిళా పైలట్ గా చరిత్ర సృష్టించారు.
1939 సంవత్సరం జోధ్పూర్లో ఆమె శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆమె భర్త విమాన ప్రమాదంలో మరణించారు. అప్పటికి ఆమె వయసు కేవలం 24 ఏళ్ళు. దీంతో ఆమె తన కమర్షియల్ పైలట్ కావాలన్న తన ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. దేశ విభజన అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఢిల్లీలో స్థిరపడ్డారు. ఆభరణాల తయారీ, చీరలకు డిజైన్ల రూపకల్పన, పెయింటింగ్ వంటి వ్యాపారాలు విజయవంతంగా నిర్వహించారు. తరువాతి సంవత్సరాలలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కోసం కూడా వివిధ డిజైన్లను రూపొందించారు
Comments
Post a Comment