శ్రీవారి దర్శనానికి రేషన్??
శ్రీవారి దర్శనానికి రేషన్?
రద్దీ నియంత్రణ కోసం టీటీడీ చర్యలు
తిరుమల, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కోరుకున్నన్నిసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం రాబోయే రోజుల్లో సాధ్యం కాకపోవచ్చు. శ్రీనివాసుడి దర్శనానికి రేషన్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నారు. దేవదాయ మంత్రి మాణిక్యాలరావు నోటి వెంట ఇటీవల ఈ ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన ఉండడంతో తొలుత ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయబోతున్నారు. దర్శనాలను క్రమబద్ధీకరిస్తే తప్ప భక్తులకు సంతృప్తికర దర్శనం చేయించలేమనే ఆలోచనతో టీటీడీ అధికారులు రేషన్ విధానానికి రూపకల్పన చేస్తున్నారు. కొత్తవిధానం ప్రకారం విచక్షణ కోటాలో దర్శనం టికెట్లను పొందేవారు నెలకు ఒక్కసారికి మించి దర్శనానికి వచ్చే వీలు ఉండదు. జేఈవో కార్యాలయంలో జారీ చేసే బ్రేక్దర్శనం టికెట్లు సహా అన్ని దర్శనాలకూ ఇది వర్తిస్తుంది. అదేవిధంగా రూ.300 టికెట్లు, స్లాట్ సర్వదర్శనం, దివ్యదర్శనాలకు వారం వరకు కాల పరిమితిని విధించే ఆలోచన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకునే ప్రయత్నాల్లో టీటీడీ ఉంది. ఈ విధానం వీఐపీలకు కూడా వర్తిస్తుంది. గత నెల నుంచి విచక్షణాధికార కోటాలో పొందే దర్శనం టికెట్లకు ఆధార్ తప్పనిసరి చేశారు. మార్చి నెలాఖరులో సర్వదర్శనానికి స్లాట్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనికి కూడా ఆధార్ కావాలి. అలాగే వచ్చే నెల నుంచి దివ్య దర్శనం టోకెన్లకు ఆధార్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి భవిష్యత్తులో ఏదో ఒక టోకెన్ లేదా టికెట్తోనే తిరుమలకు భక్తులు రావాల్సి ఉంటుంది.
By sources
Comments
Post a Comment