ట్విస్ట్ ఏంటంటే…కర్ణాటక హీరో
కర్ణాటక ఎన్నికల ఫలితాలను బీజేపీ కూడా ఊహించలేకపోయింది. అధికారం చేపట్టలేకపోవచ్చు కానీ, గతంకంటే మెరుగైన సీట్లయితే సాధిస్తామని భావించారు తప్పితే, యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేస్తారని అనుకోని ఉండరు. కానీ కన్నడ ప్రజలు అనూహ్యంగా 104 సీట్లలో కమలం వికసించేలా చేశారు. అధికారంలోకి మళ్లీ కాంగ్రెస్ పార్టీనే వస్తుందని భావించారు,కానీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని మాత్రం గ్రహించలేదు.బీజేపీ గెలుపుకు మోదీ,షాల ద్వయం అనేక హామీలను గుప్పించినప్పటికీ, గ్రౌండ్ స్థాయిలో బీజేపీ ఓటరు నాడిని పట్టుకుంది వారు కాదు. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందంటే దాని వెనక మనోడి హస్తం ఉంది.మనోడు అంటే ఎవరా అనుకుంటున్నారా మన తెలుగు బిడ్డ,తెలంగాణ లీడర్ కరడుగట్టిన కాషాయవాది మురళీధర్ రావు రావు.
గెలిచింది బీజేపీనే..కానీ గెలిపించింది మనోడు…
కర్ణాటకలో కాషాయపార్టీకి పడ్డ ప్రతీఓటు ఆయన పుణ్యమే. మురళీధర్ రావు కారణంగానే 104 మంది ఎమ్మెల్యేలు గెలవగలిగారు.ఇది నిజం.ముమ్మాటికి నిజం..అదెలా అంటారా…. వార్డు మెంబర్ గా గెలవాలన్నా సరైన అభ్యర్థి అవసరం. పార్టీ ఎంత పటిష్టంగా ఉన్నా పోటీదారులు కూడా అంతకన్నా బలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.మెజార్టీ ప్రజలు పార్టీతో పాటు, పోటీదారుడు ఎవరన్నది చూసే ఓటేస్తారు.
ఇక అలాంటిది ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయడమంటే మామూలు మాట కాదు. టికెట్ పై ఆశతో ఎంతోమంది రేసులో ఉంటారు.ఒకరిని కాదని,మరొకరికి ఇస్తే మొదటికే మోసం వచ్చే సంఘటనలు అనేకం.ఇక ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని పార్టీపై వ్యతిరేకత రాకుండా, బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రావడమంటే మామూలు విషయం కాదు.దీన్నంతా సమన్వయం చేసుకోవడం మరో పెద్ద పని.ఈ పనినే భుజాలపై ఎత్తుకున్న మురళీధర్ రావు అలవోకగా కాషాయజెండాను రెపరెపలాడేలా చేయడంలో విజయం సాధించారు.
తెలుగోడు…తెలంగాణోడు అన్న సంగతి తెలుసా…
కర్నాటక రాష్ట్ర బీజేపీకి ఇంచార్జ్ గా వ్యవహరించింది,వ్యవహరిస్తుంది మన మురళీధర్ రావుయే. ఈయన కారణంగానే ఇవాళ అతిపెద్దపార్టీగా అవతరించింది బీజేపీ. మురళీధర్ రావు పనితీరుపై ఉన్న నమ్మకంతో కర్ణాటక బాధ్యతలను మోదీ,అమిత్ షాలు అప్పగించారు. అప్పగించిన పనిని చాలా సునాయాసంగా ఫినిష్ చేశాడు. వ్యూహాలు రచించడంలో ముందు నుంచి మురళీధర్ రావుకు మంచి పేరుంది.వాస్తవ పరిస్థితులపై విశ్లేషన చేసుకుంటూ, కర్ణాటకలో సామాన్య కార్యకర్తలా మారిపోయి, ప్రతీఒక్కరితో చనువుగా మెసులుతూ పార్టీ గెలుపుకు ఏవిధంగా పనిచేయాలన్నదానిపై శిక్షణా తరగతులు నిర్వహిస్తూ క్యాడర్ లో కొత్త ఉత్తేజాన్ని నింపుతూ, నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని,అసమ్మతి రాగాన్ని తొలగిస్తూ అందరినీ కలుపుకుపోయేలా చేయడంలో మురళీధర్ రావు దిట్ట. అందుకే 2013లో 40 సీట్లు గెలిచిన బీజేపీ ఇవాళ 104 స్థానాలను గెలవగలిగింది.
కేంద్రమంత్రి పదవి కన్ఫాం….కానీ..?
దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్దగా ప్రాబల్యం లేనందున మురళీధర్ రావు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.కానీ ఆయనేంటో,ఆయన అవసరం ఏంటో భారతీయ జనతా పార్టీకి బాగా తెలుసు.అందుకే అతితక్కువ మంది ఉండే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఆయన ఒకరు. తెలంగాణలో బీజేపీకి పెద్దగా పట్టు లేనందున ఆయన చట్టసభల్లో అడుగు పెట్టలేదు.కానీ జాతీయ స్థాయిలో బీజేపీ కోసం ఎన్నో సేవలందించాడు.అందిస్తూనే ఉన్నాడు. బహుశా త్వరలో కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరిగితే మురళీధర్ రావుగు కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తప్పించిన మరుక్షణమే మురళీధర్ రావును క్యాబినెట్లోకి తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
తెలుగోడి అవసరం బీజేపీకి ఎప్పుడూ అవసరమే
ప్రస్తుతం బీజేపీకి ఏపీ నుంచి రాంమాధవ్, తెలంగాణ నుంచి మురళీధర్ రావులే కీలకం. వీరిరువురికి మంచి భవిష్యత్తు ఉందనేది జగమెరిగిన సత్యం. వీళ్లు గెలిచినా,ఓడినా పదవులు మాత్రం వీరి కాళ్లదగ్గరకు రావడం ఖాయం. అమిత్ షా తర్వాత బీజేపీకి కాబోయే అధ్యక్షుడు కూడా మురళీధర్ రావే అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ఇంచార్జ్ గా వ్యవహరించిన రాంమాధవ్ ఆ రాష్ట్రంలో బీజేపీ గెలిచేందుకు తోడ్పడ్డాడు.ఇప్పుడు కర్ణాటకలో కాషాయజెండా ఎగరడంలో మురళీధర్ రావు సత్తా చాటాడు. కానీ, ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం వీరు ప్రభావం చూపలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా వీరిద్దరికీ మంచి పేరున్నప్పటికీ రాష్ట్రాల్లోకి వచ్చేసరికి కనీసం పెద్దగా ప్రజలందరికీ తెలియకపోవడం గమనార్హం. ఈ ఇద్దరు నేతలు వారి వారి నియోజకవర్గాల నుంచి ఎంపీలుగా పోటీ చేసినా గెలుస్తారా లేదా అన్నది కూడా అనుమానామే.కానీ జాతీయ స్థాయిలో మాత్రం చక్రం తిప్పడం విశేషం.
Comments
Post a Comment