గ్రేటర్లో స్మార్ట్ విద్యుత్ మీటర్లు..! ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లవైపు డిస్కం అడుగులు ప్రభుత్వకార్యాలయాల్లో సత్ఫలితాలిస్తున్న మీటర్లు రీచార్జ్ చేసుకుంటే విద్యుత్ సరఫరా
గ్రేటర్లో స్మార్ట్ విద్యుత్ మీటర్లు..!
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లవైపు డిస్కం అడుగులు
ప్రభుత్వకార్యాలయాల్లో సత్ఫలితాలిస్తున్న మీటర్లు
రీచార్జ్ చేసుకుంటే విద్యుత్ సరఫరా
రిమోట్తో మీటర్ అపరేటింగ్.. ఆన్లైన్లో రీడింగ్.. లోడ్ను బట్టి గృహాల్లో విద్యుత్ వాడకం వంటి సౌకర్యాలన్ని స్మార్ట్ మీటర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతినెలా బిల్లు చెల్లించాలనే టెన్షన్... పాతబిల్లుల పరేషాన్ లేకుండా నగరంలో స్మార్ట్ విద్యుత్మీటర్లను విద్యుత్ శాఖ అందుబాటులోకి తీసుకురాబోతుంది. పాత విద్యుత్ మీటర్లకు చెక్ పెడుతూ ఆధునిక టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్మీటర్లు దశలవారీగా నగరంలో అందుబాటులోకి తీసుకువచ్చేలా డిస్కం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు, డిమాండ్కు అనుగుణంగా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేలా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్పంపిణీ సంస్థ (టీఎ్సఎస్పీడీసీఎల్) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా గ్రేటర్జోన్ పరిధిలోని 40 లక్షల గృహ విద్యుత్మీటర్లను దశలవారీగా స్మార్ట్ మీటర్లుగా మార్చేలా డిస్కం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా జీడిమెట్ల, ఖైరతాబాద్, శ్రీనగర్కాలనీ ప్రాంతాల్లో 500కు పైగా స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అందు బాటులోకి తీసుకువచ్చారు. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల పనితీరు బాగుందని అధికారులు చెప్పడంతో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేలా విద్యుత్శాఖ చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వకార్యాలయాల్లో...
నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలైన కలెక్టరేట్, ఆస్పత్రులు, హాస్టళ్లు, పార్కులు, ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లలో రీచార్జ్ చేసుకునే సౌకర్యం ప్రత్యేకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ సరఫరా అందిస్తూ క్రమంగా ప్రీపెయిడ్ విధానం వినియోగదారులకు అలవాటుచేసేలా విద్యుత్శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ ఆదాచేసుకునే అవకాశాలుంటాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు ప్రభుత్వ కార్యాలయాలల్లో గదుల్లో సిబ్బంది లేకపోయినా లైట్లు వేయడంతో పాటు, ఫ్యాన్లు, కంప్యూటర్లు నడవడంతో బిల్లులు పెరిగిపోతున్నాయి. స్మార్ట్మీటర్లతో ఆన్లైన్లో రీడింగ్ చూసుకోవడంతో ఏ సమయంలో ఎంత విద్యుత్ వాడుతున్నామో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. స్మార్ట్ ప్రీ-పెయిడ్ మీటర్ల ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని ఆయా శాఖలు, స్థానిక సంస్థలు భరించాలని, మూడు విడతల్లో ఆ ఖర్చును చెల్లించేలా అవకాశం కల్పించనున్నారు. ప్రీ-పెయిడ్ మీటర్లకు ఆన్లైన్లోనే చెల్లింపులు జరిపి రీచార్జ్ చేసుకునే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
స్మార్ట్ మీటర్లతో మెరుగైన ఫలితాలు
భవిష్యత్తు అంతా స్మార్ట్ మీటర్లదే. స్మార్ట్ మీటర్లను రిమోట్తో ఆన్, ఆఫ్ చేసుకునే అవకాశముంది. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లతో వినియోగదారులు లోడ్ తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ విద్యుత్ వినియోగించుకునే సౌకర్యం ఉంటుంది. నగరంలో స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. విదేశాల్లో ఇప్పటికే స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు వినియోగిస్తున్నారు. స్మార్ట్మీటర్ల ధర కూడా ఇప్పుడు రూ. 4-5 వేల వరకు ఉంటుంది. ఎక్కువసంఖ్యలో స్మార్ట్మీటర్లు కొనుగోలు చేస్తే ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉంది.. నగర మంతా స్మార్ట్మీటర్లతో విద్యుత్సరఫరా అందించే లక్ష్యంతో డిస్కం పనిచేస్తుంది.
Comments
Post a Comment