కేంద్రాన్ని నవీన్ పట్నాయక్ ఎందుకు పొగుడుతున్నారబ్బా?
కేంద్రాన్ని నవీన్ పట్నాయక్ ఎందుకు పొగుడుతున్నారబ్బా?
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు బిజు జనతా దళ్ (బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయ వర్గాలను పెద్దగా ఆశ్చర్యపరచలేదు. బీజేపీకి, కాంగ్రెస్కు సమాన దూరంగా ఉంటామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలుమార్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై వస్తున్న ఊహాగానాలను కొట్టి పడేశారు. బీజేపీ-బీజేడీ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణలను కూడా ఆయన తీసిపారేశారు.
లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు బీజేడీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ మాట్లాడుతూ.. బీజేపీకి మేలు చేసేందుకే బీజేడీ సభ నుంచి వాకౌట్ చేసిందని ఆరోపించారు.
తాజాగా, ఈ రోజు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. శానిటరీ ప్యాడ్స్పై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎత్తివేయడాన్ని కొనియాడారు. ప్యాడ్స్పై జీఎస్టీ ఎత్తివేయడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఖుషీ’ పథకానికి మేలు జరుగుతుందన్నారు.
లోక్సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రధాని నిర్ణయానికి గత నెలలో నవీన్ పట్నాయక్ ఓటేశారు. తన తండ్రి బిజూ పట్నాయక్ బయోగ్రఫీ ‘ది టాల్ మ్యాన్ బిజు పట్నాయక్’ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీతో నవీన్ పట్నాయక్ భేటీ అయ్యారు. దీంతో రానున్న ఎన్నికల్లో బీజేపీ-బీజేడీ పొత్త ఖాయమన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తను బీజేడీ కొట్టి పడేసింది. తాజాగా, నవీన్ పట్నాయక్ మరోమారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం చర్చనీయాంశమైంది.
Comments
Post a Comment