శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత.. పంబ చేరుకున్న 11 మంది మహిళా భక్తులు
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు ఆరుగులు మహిళా భక్తుల బృందం ఆదివారం తెల్లవారుజామునే పంబ బేస్ క్యాప్కు చేరుకుంది. మదురై రోడ్డు మార్గం గుండా ప్రయాణించి వీరు పంబకు చేరుకున్నారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో వీరు అక్కడకు చేరుకోగా, మరో ఐదు మంది మహిళలు వారితో కలిశారు. మొత్తం 30 మంది మహిళలు బేస్ క్యాంప్ వద్ద జమ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాగా, మహిళా భక్తులంతా 10 నుంచి 50 ఏళ్ల లోపు వారే కావడంతో వారిని అడ్డుకునేందుకు ఆందోళనకారులు మళ్లీ రంగప్రవేశం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులకూ, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. మహిళలను కొండ ఎక్కనీయకుండా అడ్డుకుంటామని ఆందోళనకారులు చెబుతున్నారు. అయితే, అయ్యప్ప దర్శనం చేసుకోకుండా తాము వెళ్లేది లేదని మహిళా భక్తులు పోలీసులకు తెగేసి చెబుతున్నారు.
పదొకండు మంది మహిళలు ఉదయమే బేస్ క్యాంప్ చేరుకోగా, వారిలో ఆరుగురు మాత్రమే కొండపైకి వెళ్తామని చెబుతున్నారని, తక్కిన వారు వారికి రక్షణగా ఉంటామని తెలిపారని, సీనియర్ అధికారుల నుంచి ఆదేశాల కోసం చూస్తున్నామని పంబ బేస్ క్యాంప్లోని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
వేర్వేరు బ్యాచ్లుగా...
అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు తమకు అనుమతివ్వాలంటూ 50 మంది మహిళా బృందం ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్కు లేఖ రాసింది. ఇందులో భాగంగా మహిళా బృందం వేర్వేరు బ్యాచ్లుగా కొండపైకి వెళ్లాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తద్వారా కొండపైన తమను అడ్డుకోవడం ఆందోళనకారులు కష్టమవుతుందనే వ్యూహంతో ఉన్నట్టు చెబుతున్నారు. వ్యూహాత్మకంగానే తాము కొండపైకి వెళ్తామని, స్వామి దర్శనం కోరుకుంటున్న వారిలో పలువురు దళిత మహిళలకు కూడా ఉన్నారని ఒక మహిళా భక్తురాలు తెలిపింది. స్వామిని దర్శించేందుకు మహిళలకు ఉన్న హక్కును కాపాడేందుకు పోలీసులు తగిన చొరవ చూపి తమకు భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. స్వామి దర్శనం కోసం తాము ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు చేసినట్టు ఆమె తెలిపారు.
Comments
Post a Comment