మంచులో చిక్కుకున్న 3వేల మంది టూరిస్టులు.. కాపాడిన సైన్యం..
సిక్కింలోని భారత్-చైనా సరిహద్దుల్లో నాథులా మార్గం వద్ద చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులను భారత సైన్యం కాపాడింది. పెద్దఎత్తున కురుస్తున్న మంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనాలు మంచులో చిక్కుకుపోవడంతో సైన్యం హుటాహుటిన వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పర్యాటకులకు వసతి కల్పించడం కోసం జవాన్లు తమ బ్యారక్లను ఖాళీ చేసి ఇవ్వడం విశేషం. పర్యాటకుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారనీ.. అందరికీ ఆహారం, వసతితో పాటు రగ్గులు కూడా అందించినట్టు ఆర్మీ వెల్లడించింది.
‘‘నాథులా మార్గాన్ని సందర్శించి తిరిగి వస్తున్న 300 నుంచి 400 వాహనాలు మంచు కారణంగా 17వ మైలు వద్ద చిక్కుకున్నాయి. భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగ సహాయక చర్యలు చేపట్టింది. అందరినీ తరలించి ఆహారం, వసతి కల్పించింది. చలినుంచి కాపాడుకోవడానికి రగ్గులతో పాటు అవసరమైన మందులు సరఫరా చేశాం..’’ అని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. 17వ మైలు వద్ద 1500 మంది చిక్కుకోగా... మిగతా వారంతా 13వ మైలువద్ద నిలిచిపోయారని ఆయన తెలిపారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు సైన్యం భారీ యంత్రాలు, డోజర్లు వినియోగిస్తోంది.
Comments
Post a Comment