పట్టువిడువని మమత.. బీజేపీకి మళ్లీ టెన్షన్!
పశ్చిమ బెంగాల్లో బీజేపీ నిర్వహించ తలపెట్టిన ‘రథయాత్ర’ను అడ్డుకునేందుకు సీఎం మమతా బెనర్జీ పట్టువిడువని పోరాటం కొనసాగిస్తున్నారు. బీజేపీ ‘రథయాత్ర’కు అనుమతి నిరాకరిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిన్న కోల్కతా హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి అనుకూలంగా ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పుపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ ఇవాళ చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ ముందుకు రానుంది.
కాగా నిన్న కోల్కతా హైకోర్టు వెలువరించిన తీర్పు మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ నెల 28 నుంచి 31 వరకు ‘రథయాత్ర’ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’ పేరుతో 3 దశలుగా రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాల్లో ‘రథయాత్ర’ నిర్వహించాలని కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా మాట్లాడుతూ.. ‘‘కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ నెల 28, 29, 31 తేదీల్లో రథయాత్ర నిర్వహించాలని పార్టీ సమావేశంలో తీర్మానించాం. ఇంకా ఈ తేదీలపై తుదినిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం..’’ అని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలతో పాటు, మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీజేపీ ‘రథయాత్రకు’ అనుమతి నిరాకరించింది. దీంతో బీజేపీ నేతలు కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Post a Comment