రామ జన్మభూమి కేసు : తదుపరి కార్యాచరణ ఈ నెల 10న
అయోధ్య రామ జన్మ భూమి వివాదం కేసులో తదుపరి విచారణ విధానంపై ఈ నెల 10న నిర్ణయం తీసుకోనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. శుక్రవారం ఈ కేసు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కే కౌల్ ధర్మాసనం సమక్షానికి విచారణకు వచ్చింది. జస్టిస్ గొగోయ్ కేవలం 30 సెకండ్లలోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. వివిధ పక్షాల తరపున హాజరైన న్యాయవాదులు తమ వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదు.
‘‘సరైన ధర్మాసనం జనవరి 10న ఈ కేసుపై విచారణ జరుపుతుంది’’ అని జస్టిస్ గొగోయ్ చెప్పారు.
దీంతో ఈ కేసుపై విచారణను నూతన ధర్మాసనం నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరొక న్యాయమూర్తిని ఈ నెల 10 లోగా నోటిఫై చేయవలసి ఉంటుంది.
2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరగవలసి ఉంది. అయోధ్య రామజన్మభూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు సమానంగా పంచుతూ హైకోర్టు తీర్పు చెప్పింది.
Comments
Post a Comment