ఉర్జిత్‌ రాజీనామా వెనుక ఒత్తిళ్లు లేవు: మోదీ

వచ్చే ఎన్నికల్లో మహాకూటమి, ప్రజలకు మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్య వివాదంపై న్యాయ ప్రక్రియ ముగిశాకే ఆర్డినెన్స్‌పై పరిశీలిస్తామని వెల్లడించారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తానని ఆయన ఆరు, ఏడు నెలల క్రితమే లిఖితపూర్వకంగా కోరారని మోదీ వివరించారు. ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. మెరుపు దాడుల నిర్ణయం ఎంతో సాహసోపేతమైందని, రాజకీయంగా తనకు ఏమైనా ఫర్వాలేదు గానీ.. సైనికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చానని వెల్లడించారు. అందుకే మెరుపు దాడుల తేదీలను రెండుసార్లు మార్చినట్టు చెప్పారు. ఆపరేషన్‌ విజయవంతమైనా, విఫలమైనా సూర్యోదయానికి ముందే తిరిగి రావాలని కమెండోలకు సూచించినట్టు వెల్లడించారు. ఉరీ సెక్టార్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 20 మంది సైనికుల ప్రాణాలను పాకిస్థాన్‌ బలిగొందన్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఉగ్రతండాలపై భారత్‌ మెరుపు దాడులు చేసిందని తెలిపారు.
భవిష్యత్తులో నోట్ల రద్దు ఫలితాలు
‘‘2019 ఎన్నికల్లోనూ దేశ ప్రజలకు తమ వైపే విశ్వాసం ఉంటుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో మాకు పూర్తి వ్యతిరేక ఫలితాలు రాలేదు. తెలంగాణ, మిజోరాంలలో మాత్రమే ప్రజలు భాజపా వైపు చూడలేదు. రెండు రాష్ట్రాల్లో హంగ్‌ అసెంబ్లీ పరిస్థితి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకే  పెద్ద నోట్ల రద్దు చేపట్టాం. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు భవిష్యత్తులో కనబడతాయి.  ఈ నిర్ణయం దేశాన్ని బలోపేతం చేస్తుంది. నల్లధనం నిర్మూలనకు తీసుకున్న చర్యలు అప్పటికప్పటివి కాదు. చాలాసార్లు ప్రజలను అప్రమత్తం చేశాకే నల్లధనంపై చర్యలు తీసుకున్నాం. నల్లధనం నిర్మూలన కోసం చాలా దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. అన్ని రాష్ట్రాల ఆమోదంతోనే  జీఎస్టీని అమలు చేశాం. దేశంలో పారదర్శక విధానం కోసమే జీఎస్టీ తీసుకొచ్చాం. జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలపై పన్నుల భారం తగ్గింది. జీఎస్టీతో చిన్న వ్యాపారులకు కొంత ఇబ్బంది కలిగింది. కానీ పరోక్ష పన్నుల విధానంలో సరళత వచ్చింది. పన్నుల విధానాన్ని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉండే జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. ప్రజలపై భారం పడకుండా జీఎస్టీలో నిరంతరం మార్పులు చేస్తూనే ఉన్నాం. జీఎస్టీ వల్ల వినియోగదారులకు లాభం చేకూరేలా కృషిచేస్తున్నాం. మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరేలా ముందడుగు వేస్తున్నాం. ఉడాన్‌తో మధ్యతరగతి ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురాగలిగాం. ఏ విషయాన్ని తీసుకున్నా.. సామాన్యుల సంక్షేమమే లక్ష్యంగా మేం పనిచేస్తున్నాం’’ 
రుణమాఫీ కేవలం ఎన్నికల స్టంటే
‘‘రుణమాఫీకి అర్హులైన నిజమైన రైతులెవరూ బ్యాంకింగ్‌ వ్యవస్థలో లేరు. చిన్న రైతులంతా వడ్డీ వ్యాపారుల వద్దే రుణాలు తీసుకుంటున్నారు. రుణమాఫీ ద్వారా అవసరమైన రైతులకు మేలు కలగదు. రుణమాఫీ కేవలం ఎన్నికల స్టంటే.  దేవీలాల్‌ నుంచి మన్మోహన్‌ వరకు అనేకసార్లు రుణమాఫీలు చేశారు. అయినా రైతు బాగుపడింది లేదు. లోపం ఎక్కడుందనేది మేం పరిశీలిస్తున్నాం. విత్తనం నుంచి మార్కెట్‌ వరకు సంస్కరణల కోసం కృషిచేస్తున్నాం. కృషి సించాయ్‌ యోజనతో రైతులకు మేలు చేశాం. ఫుడ్‌ ప్రాసిసింగ్‌ ద్వారా రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు దక్కేలా చేశాం. సౌర పరికరాల ద్వారా రైతులకు అయ్యే వ్యయాన్ని తగ్గించాం. నా దృష్టిలో సంక్షేమం అంటే రాజకీయం చేయడం కాదు’’.
మూకదాడులను ఖండించాల్సిందే 
‘‘మూకదాడులు సభ్యసమాజానికి శోభను ఇవ్వవు. వీటిని ముక్తకంఠంతో ఖండించాల్సిందే. మూకదాడులు 2014 తర్వాత మాత్రమే వచ్చినవి కాదు. ముమ్మారు తలాక్‌ అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే విస్తృత చర్చకు వచ్చింది. రాజకీయ హింస గురించి అన్ని పార్టీలూ ఆలోచించాలి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మా పార్టీ కార్యకర్తలు చాలా మంది చనిపోయారు. మతమన్నది మా విధానం కాదు.. మా పరిపాలనలో మతానికి ప్రాధాన్యం లేదు. సబ్‌కా సాత్‌ - సబ్‌కా వికాస్‌ నినాదంతో ప్రజలకు చేరువయ్యాం. భారత దేశంలో హింసకు తావులేదు. హింసనేది మన దేశ సంస్కృతికి వ్యతిరేకం’’ అని మోదీ అన్నారు.
ఆర్థిక నేరగాళ్లను వదిలేది లేదు..
* మా ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను ఈరోజైనా లేదా రేపైనా భారత్‌కు తిరిగి రప్పిస్తాం. ద్వైపాక్షిక చర్చలు, న్యాయపరమైన ప్రక్రియను అవలంభించి లేదా, ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకొని అయినా వారికి శిక్ష పడేలా చేస్తాం. ప్రజల సొమ్మును దోచుకొని పారిపోయిన వారి దగ్గర నుంచి రూపాయితో సహా మొత్తం వసూలు చేస్తాం.
పేదల సంక్షేమం కోసమే ఆయుష్మాన్‌ భారత్‌..
* కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ తీసుకొచ్చి వంద రోజులు పూర్తయింది. ఈ పథకం కింద దాదాపు కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతోంది.
మధ్యతరగతి ప్రజల పట్ల మన ఆలోచన మారాలి..
* మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నాం. వారి విషయంలో మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఒకరి దయాదాక్షిణ్యాల మీద మధ్య తరగతి ప్రజల జీవితాలు ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్లు ఎంతో గౌరవంగా జీవిస్తూ, దేశం కోసం కృషి చేస్తున్నారు.
ఇస్లామిక్‌ దేశాల్లో ముమ్మారు తలాక్‌ నిషేధం..
* ముమ్మార్‌ తలాక్‌, శబరిమల అంశాలు వేర్వేరు. పలు ఇస్లామిక్‌ దేశాల్లో ముమ్మారు తలాక్‌ను నిషేధించారు. కాబట్టి ఇది మతం లేదా విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు. ఇది లింగ సమానత్వానికి సంబంధించింది. ఇక ప్రతి ఆలయానికి కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. పురుషులను అనుమతించని కొన్ని దేవాలయాలు ఉన్నాయి.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!