ఇంకా ఇంటికి చేరుకోని ఆ ఇద్దరు కేరళ మహిళలు
శబరిమల ఆలయంలోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళలు కనకదుర్గ (39), బిందు అమ్మిని (40)లు ఇప్పటి వరకు ఇల్లు చేరుకోలేదు. ఆందోళనకారుల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరూ అజ్ఞాతంలో గడుపుతున్నారు. కేరళలోని కన్నూరు యూనివర్సిటీలో బిందు లా లెక్చరర్గా పనిచేస్తుండగా, కనకదుర్గ సివిల్ సర్వెంట్.
‘‘చాలామంది మమ్మల్ని నిరుత్సాహపరచాలని చూశారు. చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో పోలీసులు, స్నేహితులు వెనక్కి తగ్గమని సూచించారు’’ అని కనకదుర్గ తెలిపింది. ‘‘మేమేమీ భయపడలేదు. ఆలయంలోకి వెళ్లాలనుకున్నప్పుడు లక్ష్యం తప్ప మాకు మరోటి కనిపించలేదు’’ అని బిందు వివరించింది. ఆందోళనను నిలువరించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పై ఉందని పేర్కొంది. కొచ్చిలోని ఓ గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించిన బిందు, కనకదుర్గలు ఇప్పటి వరకు ఇంటికి చేరుకోలేదు. ఆందోళనకారుల నుంచి బెదిరింపులు వస్తుండడంతో వారిద్దరినీ అధికారులు ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచినట్టు తెలుస్తోంది. వచ్చే వారం బిందు, కనకదుర్గలను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు పోలీసులు ప్రణాళిక రచిస్తున్నారు. పోలీసులపైనా, కేరళ ప్రభుత్వంపైనా తనకు పూర్తి విశ్వాసం ఉందని బిందు తెలిపింది.
Comments
Post a Comment