పవన్ కల్యాణ్.. ఇప్పుడు కేసీఆర్ను ఫాలో అవుతున్నారా?
2019 సార్వత్రిక ఎన్నికల కోసం పవన్కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన.. పార్టీ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇటీవలే ప్రకటించారు. వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. అయితే బుధవారం శ్రీకాకుళంలోని కార్యకర్తలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్ మెడలో ఓ తాయత్తు దర్శనమిచ్చింది. క్రిస్మస్ వేడుకల కోసం పవన్ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఆ తాయత్తు ఆయన మెడలో ఉంది. కానీ దాన్ని అప్పుడు ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు అది బయటపడటంతో సోషల్మీడియాలో ఓ ఆసక్తికర చర్చకు తెరలేచింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బహిరంగ సభకు హాజరైనా.. ఆయన కుడి చేతికి దట్టితో దర్శనమిస్తారు. చాలా సందర్భాల్లో ప్రస్తుతం తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ.. కేసీఆర్ చేతికి దట్టి కడుతూ కనిపించారు. అయితే ఇది టీఆర్ఎస్లోని ఇతర నేతలకు కూడా సెంటిమెంట్గా మారింది. దట్టి ఉంటే.. విజయం తథ్యం అనే భావన చాలా మంది టీఆర్ఎస్ నేతల్లో పాతుకుపోయింది. దీంతో తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారంలో చాలా మంది ఆభ్యర్థులు తమ చేతికి దట్టి కట్టుకొని కనిపించారు.
అయితే ఇప్పుడు ఇదే విధానాన్ని పవన్ కూడా పాటిస్తున్నారనే వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజా బలంతో పాటు దైవ బలం కూడా తనకు తోడు కావాలని భావించి పవన్ తన మెడకి తాయత్తు కట్టించుకుని ఉంటారని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. కేసీఆర్ను విజయలక్ష్మీ వరించిన విధంగానే.. తాయత్తు మహిమతో ఘన విజయం సాధించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ ఎన్నికల్లో ప్రభంజనం కోసమే తాయత్తు కట్టుకున్నారా..! లేక దాని వెనక మరేదైన మర్మం ఉందా అనే విషయం పవన్కు, ఆయన సన్నిహితులకే తెలియాలి.
Comments
Post a Comment