‘తలసాని.. మరోసారి ఆంధ్రాలో అడుగు పెడితే ఖబడ్డార్’
సంక్రాంతి వేడుకల కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడ దుర్గమ్మ దర్శనాంతరం, యాదవులు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు, రిటర్న్ గిఫ్ట్ వ్యవహారంపై తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని.. గిఫ్ట్ రెడీగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన మాటలకు తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తలసాని వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..తలసాని మరోసారి ఆంధ్రాలో అడుగు పెడితే ఖబడ్డార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
తలసాని వల్ల ఆంధ్రాలో యాదవులు తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో బీసీ కులాలను రిజర్వేషన్ నుంచి తొలగిస్తే తలసాని నోరు ఎత్తకపోవడం సిగ్గు చేటని విమర్శలు గుప్పించారు. తెలంగాణ కంటే ఆంధ్రలో బలమైన బీసీ నేతలు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మంత్రి పదవి కోసమే తలసాని ఆంధ్రాలో ఇన్ని పాట్లు పడుతున్నారని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాగా.. శ్రీనివాస్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే తలసాని నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Comments
Post a Comment