అమీర్పేటలో పలు కోచింగ్ సెంటర్లు సీజ్
హైదరాబాద్లోని అమీర్పేట, మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న పలు ఐటీ శిక్షణా కేంద్రాలపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. అగ్ని ప్రమాద, విపత్తులను ఎదుర్కొనేందుకు ఎటువంటి భద్రతా చర్యలూ చేపట్టని కారణంగా 20 ఐటీ శిక్షణా సంస్థల్ని సీజ్ చేశారు. గతంలో సూరత్లోని ఓ కోచింగ్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 23మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే రెండు నెలల కిందట నగరంలోని అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, అశోక్నగర్లో 671 కోచింగ్ సెంటర్లకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న వాటిలో 170 కోచింగ్ సెంటర్లు తాము అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, ఇతర రక్షణ చర్యలు తీసుకుంటామని.. అందుకోసం కొంత గడువు ఇవ్వాలని కోరాయి. ఈ 170 కోచింగ్ సెంటర్లను అధికారులు మినహాయించారు. తాఖీదులు జారీచేసినప్పటికీ ఇంకా స్పందించని.. ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని గాలికొదిలేసిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. 
By sources
Comments
Post a Comment