బడ్జెట్ను ఆసక్తికరంగా మార్చే అంశాలు..!
బడ్జెట్ను ఆసక్తికరంగా మార్చే అంశాలు..!
సార్వత్రిక ఎన్నికల సమయంలో రెండు బడ్జెట్లు చూస్తుంటాము. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే మళ్లీ విజయం సాధిస్తే రెండోసారి ప్రవేశపెట్టే బడ్జెట్పై ఆసక్తి తగ్గిపోతుంది. మధ్యంతర బడ్జెట్లో ప్రవేశపెట్టిన విధానాలనే కొనసాగించేసి..చిన్న చిన్న మార్పులు చేర్పులతో కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టేస్తారు. కానీ, ఈ సారి అలాకాదు.. చాలా మంది నిపుణుల్లో బడ్జెట్పై ఉత్కంఠ నెలకొంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి.
కొత్త ఆర్థిక మంత్రి..
ఎన్నికల అనంతరం ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్ బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఆమె పాలసీల విషయంలో చాలా గోప్యతను పాటిస్తారు. తన మనసులో మాట బయటకు తెలియకుండా జాగ్రత్తపడతారు. దీనికి మోదీ లక్ష్యాలకు తగినట్లు పనిచేసుకుంటూ వెళతారనే పేరుంది. దీంతో ఆమె కొత్తగా ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కొంటారా అనే విషయంపై నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కఠిన సవాళ్లు..
ఆర్థిక వ్యవస్థ తీరు కూడా ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నంత ఆశాజనంకగా లేదు. మరోపక్క భారీ విజయాన్ని అందించిన ప్రజలకు తొలి బడ్జెట్పై అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రీ బడ్జెట్ మీటింగ్ల విషయంలో ఆమె సంప్రదాయాలను మార్చేశారు. కేవలం పారిశ్రామిక వర్గాలతోనే కాకుండా సామాన్యులతో కూడా ఆమె భేటీలను నిర్వహించారు. తాను అందరిలాంటి మూసధోరణలో ఉండబోననే సంకేతాన్ని ఆమె ఇచ్చినట్లైంది.
* మరోపక్క ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను తగ్గించి ఆమెకు అనుకూల వాతావరణాన్ని సృష్టించింది.
* వాణిజ్య పోరు కారణంగా కీలకమైన ఎగుమతుల రంగం, దేశీయ పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలను ఆమె పరిష్కరించాల్సి ఉంది.
ఆర్థిక మంత్రి పరిశీలనలోని అంశాలు...
* జీఎస్టీ శ్లాబులలో తరచూ మార్పులు చేయడం అంత మంచిది కాదు. కానీ, వాస్తవానికి జీఎస్టీ ఇంకా పూర్తిగా కుదరుకోలేదు. చాలా వర్గాల నుంచి శ్లాబుల మార్పుపై విజ్ఞప్తులు వస్తున్నాయి. మార్పులు అవసరమనే వాస్తవిక అంశాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో మార్పులు ప్రకటించడానికి సరైన సమయం.
* రుణ మార్కెట్కు కొత్తరూపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్టాంప్డ్యూటీ, ట్రాన్సాక్షన్ లెవీలో తగ్గింపు సహకరిస్తాయి. ఇవి కార్పొరేట్ సంస్థల నగదు సమీకరణకు ఉపకరిస్తాయి.
* ఇప్పటి వరకు దీర్ఘకాలిక మ్యూచ్వల్ ఫండ్స్పై ఎల్టీసీజీని విధిస్తున్నారు. ఈ సారి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పాలసీలపై కూడా వీటిని విధించే అవకాశం ఉంది.
* ఆదాయపన్నుకు సంబంధించి పన్ను పరిధిని రూ.5,00,000 లక్షలకు పెంచాలని , సెక్షన్ 80సీ పరిధిని విస్తృతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు రూ.10కోట్లకు పైగా ఆదాయం పొందేవారి కొత్త పన్ను రేటు పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిసింది.
By sources
Comments
Post a Comment