ఆరు నెలల తర్వాత కరోనా బాధితుల్లో బయటపడుతున్న కొత్త లక్షణం. అదేంటంటే..?
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 18,139 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 234 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. ఇందులో 2,25,449 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 1,50,570 మంది కరోనాతో మృతిచెందారు. అయితే కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన మూడొంతుల మంది ఆరునెలల తరువాత కూడా ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈమేరకు ప్రముఖ జర్నల్ లాన్సెట్లో పరిశోధకులు ఈ విషయాన్ని ప్రచురించారు. కరోనా పుట్టుకకు వేదికైన చైనాలోని వుహాన్లో వందల మంది కొవిడ్-19 బారిన పడిన వారిని పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వారు తెలిపారు.

దీంతో కరోనా వైరస్ ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో కండరాలు బలహీనపడటం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలను గమనించినట్లు ప్రధానంగా గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కరోనా బారిన పడిన వారి ఆరోగ్యంపై వైరస్ దీర్ఘకాలిక ఎలా ప్రభావాలను చూపుతుందో అర్థం చేసుకుంటున్నామని నేషనల్ సెంటర్ ఫర్ రెస్పిరేటరీ మెడిసిన్ ప్రధాన శాస్త్రవేత్త బిన్ కావో చెప్పారు.

కరోనా నుంచి డిశ్ఛార్జి అయిన 1655 మంది బాధితులను పరిశీలించగా 1265 మందిలో ఏదో ఒక లక్షణం గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఇందులో 63 శాతం మంది కండరాల బలహీనతతో, 26 శాతం నిద్రలేమితో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ బారిన పడిన వ్యక్తుల్లోని యాంటీబాడీల స్థాయిలను పరిశీలించగా.. రోగనిరోధక స్థాయి 52.5 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు.
Comments
Post a Comment