భాగమతి-భాగ్ నగర్.. భాగ్యలక్ష్మి-భాగ్యనగర్.. ఈ పేర్ల వెనుక చరిత్ర ఏమిటి?
భాగమతి-భాగ్ నగర్.. భాగ్యలక్ష్మి-భాగ్యనగర్.. ఈ పేర్ల వెనుక చరిత్ర ఏమిటి?
హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామంటే కొందరు హైరానా పడిపోతున్నారు.. నిజానికి హైదరాబాద్ పేరు ఎంత ప్రసిద్ధమో భాగ్యనగర్ కూడా అంతే పాపులర్.. అసలు భాగ్యనగర్ అనే పేరు ఎందుకు ఉంది అంటే చరిత్ర లోతుల్లోకి వెళ్లాలి.. 430 ఏళ్ల నాటి ముచ్చట్లు ఇవి..
🔸భాగమతి కథ🔸
ప్రచారంలో ఉన్న చరిత్ర ప్రకారం భాగమతి పేరిట వెలిసిన నగరం భాగ్యనగర్ అంటారు.. ఈ నగరాన్ని నిర్మించిన గోల్కొండ సుల్తాన్ మహమద్ కులీ కుతుబ్షా ప్రేమ కథ అందరికీ తెలిసే ఉండాలి.. ఆయన భాగమతి అనే యువతిపై మోజుపడి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక దేవదాసి అంటారు. నిజానికి హైదరాబాద్కన్నా పూర్వమే ఇక్కడ జనావాసాలు ఉండేవి.. కులీ కుతుబ్షా దీనికి నగర స్థాయి కల్పించి విస్తరించాడు.. భాగమతి పేరిట భాగ్నగర్ నిర్మించాడని, ఆ తర్వాత అది భాగ్యనగర్గా మారిందని కొందరు చరిత్ర కారులు చెబుతారు.. మరి కొందరు చరిత్రకారులు ఇది కల్పితం, అసలు భాగమతి ప్రేమ కట్టుకథ అంటారు.. ఏదైతేనే భాగమతి పెళ్లయిన తర్వాత హైదర్మహల్గా మారింది.. భాగ్యనగర్ పేరు హైదరాబాద్ అయిపోయిందంటారు.. (కులీ కుతబ్షా.. మూసీ నది వరద.. వగైరా కథను షాక్ట్కట్ చేస్తున్నాను)
మహమద్ కులీ కుతుబ్ షాకు, భాగమతికి పుట్టిన కూతురు హయత్ బక్షీ బేగం.. (ఈమె పేరుతో హయత్నగర్ ఏర్పడింది, అక్కడ ఆమె సమాధి కూడా ఉంది) కులీ కుతుబ్ షాకు మగ సంతానం లేకపోవడంతో హయాత్ బక్షీ బేగం భర్త మహమ్మద్ కుతుబ్ షాను రాజ్యానికి వారసునిగా చేస్తాడు. ఈ మహమ్మద్ కుతుబ్ షాకు తన అత్త భామమతి ఒక దేవదాసి అనే వాస్తవం మింగుడు పడేది కాదు.. అందుకే 'భాగ్యనగర్' ఆనవాళ్లను చరిపేసి హైదరాబాద్ పేరు ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి.. కుతుబ్షాహీల సమాధులన్నీ గోల్కొండ సమీపంలో ఉంటే, భాగమతి సమాధి మాత్రం దిక్కుముక్కు లేకుంగా తలాబ్కట్ట దగ్గర అనామకంగా పడిఉంది.. ఈ కథల్లో కొంత అతిశయోక్తి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది..
భాగ్ నగర్ అనే పేరు ఇక్కడ ఉండే తోటల కారణంగా వచ్చిందని మరికొందరు చెబుతారు..
🔸నగర దేవత భాగ్యలక్ష్మమ్మ🔸
చార్మినార్ కట్టిన ప్రాంతంలో ఒక దేవత గుడి ఉండేది.. బొడ్రాయి రూపంలో ఉన్న ఆ అమ్మవారే భాగ్యలక్ష్మమ్మ.. చార్మినార్ కడుతున్న రోజుల్లో అక్కడ కాపలాదారు ఉండేవాడు.. ప్రతిరోజూ రాత్రి ఒక వృద్దురాలు అక్కడికి వచ్చి అతనితో మాటలు కలిపేది..కాపలాదారుడు 'అవ్వా.. నేను ఇంటికి పోయి అన్నం తినొస్తా.. అప్పటి వరకూ ఒక్కడే ఉంటావా?.. ' అని అడిగేవాడు. 'పోయి అన్నం తినిరా నాయనా.. నువ్వొచ్చే దాకా ఇక్కడే ఉంటా..' అని అమె ఒప్పుకునేది...
కొన్ని తర్వాత ఆ కాపలాదారుకి ఈ అవ్వ ఒవరో కాదు. ఒక దేవత అని అర్థమైంది.. మరునాడు ఎప్పటిలాగా 'అవ్వా.. నేను ఇంటికి పోయి అన్నం తినొస్తా.. అప్పటి వరకూ ఒక్కడే ఉంటావా?.. ' అని అడిగాడు. 'పోయి అన్నం తినిరా నాయనా.. నువ్వొచ్చే దాకా ఇక్కడే ఉంటా.. ' అమె బదులిచ్చింది.. కానీ వెళ్లిన కాపలాదారు మళ్లీ తిరిగి రాలేదు.. పాపం ఆ అవ్వ ఇచ్చిన మాట ప్రకారం అక్కడే ఉండిపోయింది.. భాగ్యలక్ష్మమ్మగా స్థిరపడిపోయింది.. హైదరాబాద్ లో మా తాత ముత్తాతల కాలం నుంచి వినిపిస్తున్న భాగ్యలక్ష్మి మందిర స్థల పురాణం ఇది..
మరో కథనం ప్రకారం చార్మినార్ నిర్మాణంలో పాల్పంచుకున్న కూలీలు రోజూ పూజలు చేసుకోవడానికి అక్కడ చిన్న గుడి కట్టుకున్నారని అంటారు.. భాగ్య లక్ష్మమ్మకు 'చార్మినార్ మైసమ్మ' అనే ఇంకో పేరు కూడా ఉంది. ఏటా బోనాల పండుగ ఇక్కడ ఘనంగా చేస్తారు.
1908లో మూసీనది వరదలు హైదరాబాద్ ను ముంచెత్తాయి. వేలాది మంది చనిపోయారు.. ప్రధానమంత్రి మహారాజా కిషన్ పర్షాద్ సూచన మేరకు ఆరో నిజాం మీర్ మహబూబు అలీఖాన్ మూసీ నదికి పూజలు చేశారు.. అప్పట్లో వరద నీరు చార్మినార్ వరకూ వచ్చింది. నవాబు భాగ్యలక్ష్మి అమ్మవారికి కూడా పూజలు చేశాక వరదలు తగ్గాయి.
భాగ్యలక్ష్మి మందిరం మీద భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు.. ఒకటి మాత్రం నిజం.. నిజమైన మత సామరస్యానికి ఈ ఆలయం ప్రతీకగా నిలిచింది. కొందరు మతతత్వ వాదులకు భాగ్యలక్ష్మి మందిరం అంటే గిట్టదు. అసలు అక్కడ గుడే లేదు అని గొడవలకు దిగుతారు.. వారికి కొందరు సోకాల్డ్ సెక్యులర్లు వత్తాసుగా నిలుస్తారు..
చార్మినార్ ఎంత నిజమో.. భాగ్యలక్ష్మి మందిరం అంతే నిజం.. ఇది చారిత్రిక సత్యం.. మన నగర దేవత భాగ్యలక్ష్మమ్మ.. ఆమె పేరుతోనే భాగ్యనగర్ ఏర్పడిందని నేను నమ్ముతాను..
#భాగ్యనగర్ #BhagyaNagar #భాగ్యలక్ష్మి #BhagyaLakshmi
Comments
Post a Comment